న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నాడంటూ ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. మలయాళం పత్రిక మాతృభూమికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పేరుతో ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై అయన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఆర్టికల్ ఆధారంగా చేసుకుని థరూర్.. పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారంటూ ప్రచారం మొదలైంది.
ప్రచారంపై మీడియా శశిథరూర్ను ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. అధ్యక్ష పదవి రేసులో ఉన్నారా.. లేరా..? అనే విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆ విషయంపై తానేమీ మాట్లాడనని చెప్పారు. అయితే ఫ్రీ అండ్ ఫెయిర్గా అధ్యక్ష ఎన్నికలు జరుగాలంటూ ఆర్టికల్లో పేర్కొన్న తన అభిప్రాయానికి మాత్రం తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదని థరూర్ తన ఆర్టికల్లో అభిప్రాయపడ్డారు. అధ్యక్ష ఎన్నికలు జరిగితేనే ప్రజల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. వచ్చే అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో పోటీకి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఇద్దరూ సుముఖంగా లేకపోవడంతో.. గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తే అధ్యక్షుడు కానున్నాడని ప్రచారం నడుస్తున్నది.