Shashi Tharoor : ‘కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి శశిథరూర్ (Shashi Tharoor) సేవలు అక్కర్లేకపోతే.. అతడు చేసుకోవడానికి ఇంకా ఇతర పనులు చాలా ఉన్నాయి’ అని ఆ పార్టీ సీనియర్ నేత (Senior leader) శశిథరూర్ హైకమాండ్ (High Command) కు సందేశం పంపారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం (Left Government) పై ఇటీవల ప్రశంసలు కురిపించాడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శశిథరూర్పై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇలాంటి సందేశం పంపడం చర్చనీయాంశమైంది.
అదేవిధంగా కేరళలో కాంగ్రెస్కు నాయకుడు లేడని కూడా శశిథరూర్ వర్తమానం అనే మలయాళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ పూర్తి ఇంటర్వ్యూ బుధవారం ప్రసారం కానుంది. దానికి సంబంధించి టీజర్ ఇప్పటికే బయటకు వచ్చింది. దౌత్యవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన శశిథరూర్ కేరళ నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం కావడాన్ని కూడా శశిథరూర్ ప్రశంసించారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన విమర్శలు ఎదుర్కోవడానికి కారణమైంది. అయితే శశిథరూర్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి తన అభిప్రాయాలను తెలియజేసే హక్కు తనకు ఉందని ఆయన చెప్పారు.
‘పార్టీ నేను కావాలని కోరుకుంటే పార్టీ కోసం పనిచేస్తా. వద్దనుకుంటే నేను చేసుకునే సొంత పనులు చాలా ఉన్నాయి. కాలం గడపడానికి నాకు ఎలాంటి వ్యాపకాలు లేవని మీరు అనుకోవద్దు. నాకు చాలా వ్యాపకాలు ఉన్నాయి. పుస్తకాలున్నాయి. ప్రసంగాలున్నాయి. నా స్పీచ్ కోసం ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానాలు ఉన్నాయి.’ అని శశిథరూర్ కాంగ్రెస్కు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని, కానీ ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అవే ఫలితాలు ప్రతిబింబించలేదని థరూర్ తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలువాలంటే కాంగ్రెస్ పార్టీ మరింత విస్తరించాలని, లేకపోతే వరుసగా మూడోసారి కూడా ప్రతిపక్షానికే పరిమితం కావడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేరళలో ప్రస్తుతం ఉన్న బలంతో గెలువడం అసాధ్యమని చెప్పారు.