ముంబై: బీజేపీతో చేతులు కలిసేందుకు శరద్ పవార్ (Sharad Pawar) గతంలో సిద్ధమయ్యారని అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. 2023లో అజిత్ పవార్ తన వర్గంతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరినప్పుడు బీజేపీతో చేతులు కలిపేందుకు తొలుత ఆయన సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. అయితే శరద్ పవార్ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని ప్రఫుల్ పటేల్ అన్నారు. బుధవారం ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘2023 జులై 2న అజిత్ పవార్, తాము మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాం. జూలై 15, 16 తేదీల్లో శరద్ పవార్ను కలిశాం. మాతో కలిసిరావాలని అభ్యర్థించాం. అనంతరం పూణేలో అజిత్ పవార్, శరద్ పవార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీతో చేతులు కలిపేందుకు శరద్ పవార్ 50 శాతం సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎప్పుడూ కూడా చివరి నిమిషంలో సంకోచిస్తారు’ అని ప్రఫుల్ పటేల్ అన్నారు.
కాగా, ప్రస్తుతం ఎన్సీపీ-శరద్చంద్రపవార్ వర్గానికి నేతృత్వం వహిస్తున్న శరద్ పవార్, తాను ఎప్పటికీ బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదన్నారు. ‘మీరు ఎలాంటి గందరగోళానికి లోనుకావద్దు. ఏం చేసినా రాజీపడబోం. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పోరాడుదాం’ అని తన క్యాడర్కు ఇటీవల పిలుపునిచ్చారు.
#WATCH | Gondia | On whether or not Sharad Pawar wanted to go with BJP after Ajit Pawar's oath-taking in July 2023, Nationalist Congress Party's Praful Patel says, "On 2nd July 2023, when Ajit Pawar and our ministers took oath with Maharashtra govt. On 15th-16th July, we met… pic.twitter.com/Dt6gb1pv9z
— ANI (@ANI) April 10, 2024