ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ను జైలుకు పంపిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ హెచ్చరించారు. నాగపూర్లో బుధవారం జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొన్న ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అనిల్ దేశ్ముఖ్ అమాయకుడని, ఆయనను జైలుకు పంపడంలో కీలకంగా వ్యవహరించిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇచ్చారు.
‘అనిల్ బాబు (దేశ్ముఖ్) కేసు చూశాం. అతడి నేరం ఏమిటి? మీకందరికీ బాగా తెలుసు. ఒక రోజు పరమ్ బీర్ సింగ్ నన్ను కలవడానికి వచ్చాడు. దేశ్ముఖ్పై సీఎంకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. దాని గురించి నేను అతనిని అడిగినప్పుడు, డబ్బు దోపిడీకి సంబంధించి దేశ్ముఖ్ తనకు సూచనలు ఇచ్చాడని చెప్పాడు. సూచనలను మీరు అమలు చేశారా అని నేను అడిగాను. చేయలేదని ఆయన చెప్పాడు. దేశ్ముఖ్ సూచలను అమలు చేయకపోతే ఆయన చేసిన నేరం ఏమిటో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను’ అని శరద్ పవార్ అన్నారు. దేశ్ముఖ్పై ఆరోపణలు చేసిన పరమ్ బీర్ సింగ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
‘మీరు (బీజేపీ) ఒక వ్యక్తి (దేశ్ముఖ్)పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన (దేశ్ముఖ్) నన్ను కలవడానికి వచ్చాడు. పోలీసు కమిషనర్కి ఫిర్యాదు చేశానని చెప్పాడు. విచారణ పూర్తయ్యే వరకు పదవిలో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. హోంమంత్రి పదవికి రాజీనామా చేశాడు. మీరు (బీజేపీ) ఆయన్ను (దేశ్ముఖ్) కటకటాల వెనక్కి పంపారు. మేము మౌనంగా ఉండం. మీరు ప్రతి రోజు, ప్రతి గంట మూల్యం చెల్లించేలా చేస్తాం’ అని శరద్ పవార్ పరోక్షంగా బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు.