ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయమై నరేంద్రమోదీ సర్కార్కు కేంద్ర మాజీమంత్రి- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మద్దతు పలికారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
కేంద్రం ఆమోదించిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరం లేదని గురువారం పవార్ చెప్పారు. సాగు చట్టాలను సవరించాల్సిందేనని, అయితే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వం తీర్మానం ఆమోదిస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పవార్ సమాధానమిస్తూ.. పూర్తిగా చట్టాలను సవరించాల్సిన అవసరం లేదన్నారు. రైతులు అభ్యంతరం చెబుతున్న అంశాలను సవరించాల్సి ఉందన్నారు.
చట్టాలను పూర్తిగా తిరస్కరించడానికి బదులు రైతుల అభ్యంతరాలు ఉన్న అంశాలను సవరించాలన్నారు. దీనిపై అన్ని పార్టీలతో చర్చించిన మీద అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని పవార్ తెలిపారు.
కేంద్ర వివాదస్పద చట్టాలను ఎంవీఏ ప్రభుత్వంలోని మంత్రుల గ్రూప్ అధ్యయనం చేస్తున్నదన్నారు. ఈ చట్టాలను అమలు చేయడానికి ముందు వివాదాస్పద అంశాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రెండు రోజుల పాటు జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు వస్తుందని భావించడం లేదన్నారు పవార్.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారని పవార్ గుర్తు చేశారు. ఈ అంశంపై రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్నదని చెప్పారు. తిరిగి చర్చలు జరిపేందుకు కేంద్రం చొరవ చూపాలని సూచించారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గతేడాది నవంబర్ 26 నుంచి రైతులు ఆందోళన సాగిస్తున్నారు. ఘాజీపూర్, సింఘు సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. తొలి నుంచి కేంద్ర వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేయాలని కోరుతున్నారు పవార్.