లక్నో: కేంద్రంలోని అధికార బీజేపీపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి గళమెత్తారు. రేషన్ కోసం జాతీయ జెండా కొనాలని పేదలను డిమాండ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పేదలకు భారంగా మారడం దురదృష్టకరమని ఉత్తర పద్రేశ్ పిలిభిత్ ఎంపీ అయిన ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత హర్యానాలోని కర్నాల్లో రేషన్ కోసం వచ్చిన పేద ప్రజలకు రూ.20 చొప్పున జాతీయ జెండాను బలవంతంగా అమ్మడాన్ని తప్పుపట్టారు.
జాతీయ జెండా కొనని పేదలకు రేషన్ నిరాకరిస్తున్నారని, లేకపోతే రేషన్లో కొత వేస్తున్నారని వరుణ్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్ చేశారు. ‘75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పేదలకు భారంగా మారడం దురదృష్టకరం. త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయాలని రేషన్ కార్డుదారులను ఒత్తిడి చేస్తున్నారు. లేకపోతే వారి రేషన్ నుంచి మినహాయిస్తున్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రేషన్ పేరుతో పేదలతో బలవంతంగా కొనిపించడం సిగ్గుచేటు’ అని హిందీలో పేర్కొన్నారు. కొందరు బాధితులు మీడియాతో మాట్లాడుతున్న వీడియోను దీనికి జత చేశారు.
आजादी की 75वीं वर्षगाँठ का उत्सव गरीबों पर ही बोझ बन जाए तो दुर्भाग्यपूर्ण होगा।
राशनकार्ड धारकों को या तिरंगा खरीदने पर मजबूर किया जा रहा है या उसके बदले उनके हिस्से का राशन काटा जा रहा है।
हर भारतीय के हृदय में बसने वाले तिरंगे की कीमत गरीब का निवाला छीन कर वसूलना शर्मनाक है। pic.twitter.com/pYKZCfGaCV
— Varun Gandhi (@varungandhi80) August 10, 2022