న్యూఢిల్లీ, అక్టోబర్ 31: లైంగికదాడికి గురైన బాధితులను నిర్ధారించేందుకు జరిపే రెండువేళ్ల పరీక్షను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ పరీక్షకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని తెలిపింది. అప్పటికే కుంగిపోయిన సదరు మహిళ గౌరవానికి ఈ పరీక్ష వల్ల మరోసారి భంగం కలుగడమే కాకుండా ఆమె మళ్లీ అదే రకమైన అవమానానికి గురికావాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
లైంగికదాడిని నిర్ధారించేందుకు వారిపై లైంగిక సంపర్కం జరిగిందో లేదో తెలుసుకోవడానికి దవాఖానల్లో ‘రెండు వేళ్ల’ పరీక్ష నిర్వహిస్తున్నారు. తాను లైంగికదాడికి గురయ్యాను అని చెప్తున్న మహిళ మాటలు నమ్మకండా వారికి పరీక్షలు చేయడం ‘పితృస్వామ్య విధానం’, ‘వివక్షాపూరితం’ అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దాడికి గురైనప్పటికీ లైంగికపరంగా ఆమె ఇంకా చురుకుగా ఉన్నదన్న నెపంతో పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని పేర్కొంది.
చట్ట విరుద్ధం
‘లైంగికదాడికి గురైన వారిపై ఈ న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా రెండువేళ్ల పరీక్ష లేదా యోని పరీక్ష నిర్వహిస్తే వారు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినట్టే’ అని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. లైంగికదాడి, హత్య కేసులో శైలేంద్రకుమార్ అనే నిందితుడిని హైకోర్టు విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేసిన సర్వోన్నత న్యాయస్థానం.. దోషికి ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను ఖరారుచేసింది.
ఈ కేసులో బాధితురాలిపై లైంగిక సంపర్కం జరిగిందో లేదో తెలుసుకోవడానికి జార్ఖండ్లోని దేవగఢ్ సదర్ దవాఖాన మెడికల్ బోర్డు రెండు వేళ్ల పరీక్ష నిర్వహించడాన్ని ధర్మాసనం గమనంలోకి తీసుకుంది. ‘ఈ పరీక్ష లైంగిక దాడి జరిగిందనీ లేదా జరగలేదనీ రుజువు చేయలేదు. పైగా ఇటువంటి పరీక్ష వల్ల బాధితులు మరోసారి ఆవేదనకు గురవుతారు, వారి గౌరవానికి భంగం కలుగుతుంది’ అని వ్యాఖ్యానించింది.
ఇంతకుముందే నిషేధం
2013లో హర్యానా వర్సెస్ లిల్లూ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ‘వైద్యపరమైన పరీక్ష సదరు మహిళ గోప్యత హక్కును, ఆమె నైతికతను, గౌరవాన్ని ఉల్లంఘిస్తుంది. నిందితుడు ఆమెను రేప్ చేశాడా లేదా అన్నది నిర్ధారించే ముందు ఆమె లైంగిక చరిత్రను ఆరా తీయడం అసంబద్ధం. సత్యానికి మించి అక్కడ ఏమీ ఉండదు. ఆమె ఇచ్చే సాక్ష్యానికి ఉండే విలువ ఆమె లైంగిక చరిత్రపై ఆధారపడి ఉండదు. ఆమె లైంగికపరంగా ఇంకా చురుకుగా ఉన్నంత మాత్రాన, తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె చెప్పడాన్ని నమ్మకపోవడం పితృస్వామిక విధానం, వివక్షాపూరితమే’ అని వ్యాఖ్యానించింది.
దేశమంతా ప్రచారం చేయాలి
లైంగిక హింస కేసుల్లో రేండు వేళ్ల పరీక్షను నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2014, మార్చి 19న జారీచేసిన మార్గదర్శక సూత్రాలను దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దవాఖానలు, డాక్టర్లకు వర్క్షాప్లు నిర్వహించి అవగాహన కల్పించాలని, మెడికల్ కాలేజీల్లో పాఠ్యాంశాలను మార్చాలని సూచించింది.