జైపూర్: ఒక సాధువును హత్య చేశారు. ఆయన శరీరాన్ని నాలుగు ముక్కలుగా నరికి నది సమీపంలో పడేశారు. రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మృతుడ్ని 60 ఏళ్ల మహముద్దీన్ ఖాన్గా గుర్తించారు. ధోల్పూర్లోని భీమ్ఘర్ గ్రామానికి చెందిన ఆయన చాలా కాలం కిందట మతం మారారు. జిల్లాలోని చామర్ మాత ఆలయంలో పదేళ్లుగా పూజారిగా ఉన్నారు. అయితే బుధవారం నాలుగు ముక్కలుగా నరికి ఉన్న ఖాన్ మృతదేహం ఒక నది సమీపంలో పడి ఉంది. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ముక్కలుగా నరికి పడేసిన ఖాన్ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కొందరు సాధువులతో ఆయనకు ఘర్షణ జరిగినట్లు తమకు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాన్ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఆ సాధువులంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిపైనే తమ అనుమానమని పోలీసు అధికారి తెలిపారు. ఖాన్ హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.