న్యూఢిల్లీ: ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియా వేదికలను ఎలా నియంత్రించాలన్న విషయమై ద్రుష్టిని కేంద్రీకరించాయని కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. సోషల్ మీడియా జెయింట్ ట్విట్టర్పై కేంద్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఎటువంటి సంకేతాలు పంపుతుందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పైవిధంగా చెప్పారు.
నూతన ఐటీ రూల్స్ అమలు చేయడానికి బదులు ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగా ధిక్కారస్వరం వినిపిస్తున్నదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల మండి పడ్డారు.
నూతన ఐటీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు ట్విట్టర్కు కేంద్రం మధ్యవర్తిత్వ హోదా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఎటువంటి చట్టవిరుద్ధ కంటెంట్ను పోస్ట్ చేసినా ట్విట్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
స్టీల్ ధరలు పెరిగిపోవడంతో ఎంఎస్ఎంఈ ఇంజినీరింగ్ సెక్టార్ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటాయన్న సంగతి తనకు తెలుసునన్నారు. కానీ ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే స్టీల్ ధరలు అతి చౌక అని వ్యాఖ్యానించారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల ఆందోళన తనకు తెలుసునని చెప్పారు.