కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ జలక్ ఇచ్చింది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ టాప్ గేర్లో దూసుకెళ్తున్నది. తాజా సమాచారం ప్రకారం 190 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. మమతా బెనర్జీ సర్కారుకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు పోటెత్తినట్లు ట్రెండింగ్ ద్వారా తెలుస్తోంది. ఓటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టడంతో.. ఆ హవాలో తృణమూల్ కాంగ్రెస్ నేత మానస్ భునియా వెనుకంజలో పడ్డారు. పశ్చిమ్ మిడ్నాపూర్ జిల్లాలోని సబాంగ్ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మానస్ భునియా తాజా సమాచారం ప్రకారం వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి బీజేపీ నేత అమల్ కుమార్ పండా ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్ కౌంటింగ్ ముగిసే వరకు ఆయన 1630 ఓట్లు వెనుకబడి ఉన్నారు. మమతా బెనర్జీ సర్కారులో మానస్ భునియా మంత్రిగా చేశారు. పలు శాఖలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. అయితే సబాంగ్ నియోజకవర్గం నుంచి మానస్ భునియా నాలుగు సార్లు టీఎంసీ అభ్యర్థిగా, మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. కానీ ఈసారి ఆయనకు వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి.