న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్ కొరత నెలకొన్న నేపథ్యంలో ‘కొవిషీల్డ్’ ఉత్పత్తి సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా మంగళవారం కీలక ప్రకటన చేశారు. దేశ ప్రజల ప్రాణాలను పణంగాపెట్టి టీకా డోసులను విదేశాలకు ఎగుమతి చేయబోమని స్పష్టం చేశారు. దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్కు పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్ వంటి ఎక్కువ జనాభా కలిగిన దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు, మూడు నెలల్లో పూర్తికాదన్నారు. ప్రపంచంలోని అందరికీ టీకాలు వేయడానికి 2-3 ఏండ్లు పట్టొచ్చన్నారు.
20 కోట్ల డోసుల సరఫరా
ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టటం, అప్పుడే వ్యాక్సిన్ ఉత్పత్తి పెద్దమొత్తంలో జరుగటంతో దేశంలో టీకా కార్యక్రమం ప్రారంభమైనట్టు పూనావాలా తెలిపారు. అదే సమయంలో విదేశాల్లో మహమ్మారి విజృంభించిందని.. దీంతో ఆ దేశాలకు కూడా టీకాలను ఎగుమతి చేశామన్నారు. అయితే, సెకండ్ వేవ్ ఉద్ధృతితో మనదేశంలో పరిస్థితులు దిగజారాయన్నారు. గతేడాది విదేశాలకు హెచ్సీక్యూ వంటి ఔషధాలను సరఫరా చేసి ఆపన్న హస్తం అందించిన భారత్.. ప్రస్తుతం సాయం కోసం ఎదురుచూసే పరిస్థితులు వచ్చాయన్నారు. అమెరికాలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు అనుమతులు వచ్చిన రెండు నెలల అనంతరం తమకు ఎమర్జెన్సీ అనుమతులు వచ్చాయని, అయినప్పటికీ.. 20 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేశామన్నారు. టీకా ఉత్పత్తిలో ప్రపంచంలోనే తొలి మూడు స్థానాల్లో తమ కంపెనీ ఉన్నదన్నారు. కరోనా మహమ్మారి భౌగోళిక, రాజకీయ సరిహద్దులకు పరిమితమైంది కాదని తెలిపారు. పేద, మధ్య తరగతి దేశాలకు టీకాలను సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘కొవాక్స్’ కార్యక్రమం కోసం కూడా టీకాలను సరఫరా చేస్తామన్నారు. దేశంలో టీకాల కొరత నెలకొన్న నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పూనావాలా ఈ వివరణ ఇచ్చారు.
ఊరంతా టీకాలు
వేసుకుంటే రూ.10 లక్షలిస్తాం
పంజాబ్ సీఎం అమరీందర్ ప్రకటన
గ్రామంలో ఉన్న ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ఆ ఊళ్లకు రూ.10 లక్షల ప్రత్యేక అభివృద్ధి గ్రాంటు విడుదల చేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. కరోనా టీకా వేసుకోవడానికి గ్రామాల్లో ప్రజలు సంశయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. గ్రామస్తులంతా టీకా వేసుకునేలా అవగాహన కల్పించాలని ఆయన సర్పంచ్లను కోరారు.