న్యూఢిల్లీ: దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం అవుతున్నట్లు వచ్చిన వార్తల పట్ల సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ సమస్య అని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ బీవీ నాగరత్న, ఆర్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం చిన్నారుల అదృశ్య కేసులపై రియాక్ట్ అయ్యింది. దేశంలో దత్తత ప్రక్రియ చాలా సంక్లిష్టతరంగా ఉన్నదని, ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా సక్రమంగా మార్చాలని కోర్టు చెప్పింది. ఓ న్యూస్పేపర్లో చదివానని, దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం అవుతున్నారని, దీంట్లో ఎంత నిజం ఉందో లేదో తెలియదని, కానీ ఇది సీరియస్ అంశమని జస్టిస్ నాగరత్న అన్నారు. దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా ఉన్న కారణంగా, దాన్ని అతిక్రమిస్తున్నారని, పిల్లల కోసం అక్రమ విధానాలు ఆచరిస్తున్నారని ధర్మాసనం పేర్కొన్నది.
కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదించారు. పిల్లలు మిస్సింగ్ కేసులను పరిశీలించేందుకు నోడల్ ఆఫీసర్ను నియమించాలని, దీని కోసం ఆరు వారాల గడువు ఇవ్వాలని ఐశ్వర్య కోరారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆరు వారాల గడువు ఇవ్వడం కుదరదని, ఈ ప్రక్రియను డిసెంబర్ 9వ తేదీలోగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.