శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన వేర్పాటువాది, హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ (Mirwaiz Umar Farooq)కు విముక్తి లభించింది. నాలుగేళ్ల పాటు గృహనిర్బంధంలో ఉన్న ఆయనను శుక్రవారం విడుదల చేశారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న రద్దు చేసింది. అలాగే ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మాజీ సీఎంలతోపాటు పలువురు రాజకీయ నేతలను గృహ నిర్బంధం చేసింది.
కాగా, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నాటి నుంచి నాలుగేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉన్నారు. దాని నుంచి విముక్తి కోసం జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టును ఇటీవల ఆయన ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సీనియర్ పోలీసు అధికారులు గురువారం మిర్వాయిజ్ నివాసానికి వెళ్లారు. గృహ నిర్బంధం నుంచి విడుదల చేస్తున్నట్లు ఆయనకు చెప్పారు. శుక్రవారం ప్రార్థనల కోసం జామియా మసీదుకు వెళ్లేందుకు కూడా అనుమతించారు. మరోవైపు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్కు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించడాన్ని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ స్వాగతించారు.