న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ప్రపంచదేశాలను వణికించిన కరోనా మహమ్మారి మూలాల మిస్టరీ ఇంకా వీడలేదు. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ లీక్ అయ్యిందన్న వాదనలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. తాజాగా అందుకు బలం చేకూర్చేలా వుహాన్ ల్యాబ్లో పనిచేసిన ప్రముఖ అమెరికన్ ఎపిడమాలజిస్ట్ ఆండ్రూ హాఫ్స్ సంచలన విషయాలు వెల్లడించారు. కొవిడ్-19 వైరస్ మానవ నిర్మితమేనని, వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయ్యిందని బయటపెట్టారు. తాను రాసిన ‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’ అనే పుస్తకంలో ఈ వివరాలను పొందుపరిచారు. ఈ పుస్తక సారాంశం బ్రిటన్ పత్రిక ‘ది సన్’లో ప్రచురితమైంది.
అలాగే, ఇదే విషయంపై న్యూయార్క్ పోస్ట్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ)లో వైరస్లపై పరిశోధన చేసేటప్పుడు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంవల్లే కరోనా వైరస్ లీక్ అయినట్టు హాఫ్స్ తన పుస్తకంలో పేర్కొన్నారు. యూఎస్ నిధులతో చైనాలో కరోనా వైరస్లపై చేపట్టిన పరిశోధన వల్లే ఈ మహమ్మారి వ్యాప్తి చెందిందని తెలిపారు. ‘ముఖ్యంగా విదేశీ ల్యాబోరేటరీలలో బయో సేఫ్టీ, బయో సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్కు సంబంధించిన సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం..
వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్ లీక్కు కారణమైంది’ అని వెల్లడించారు. కొవిడ్-19 జన్యుపరంగా తయారుచేసిందేనని మొదటినుంచీ చైనాకు తెలుసునని పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులు చూసి భయపడిపోయానని హాఫ్స్ తెలిపారు. మనమే ఈ ప్రమాదకర జీవాయుధ సాంకేతికతను చైనాకు బదిలీ చేస్తున్నామని అమెరికాను ఉద్దేశించి పుస్తకంలో వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 2014-2016వరకు న్యూయార్క్లోని అంటువ్యాధులపై అధ్యయనం నిర్వహించే ‘ఎకోహెల్త్ అలయెన్స్’ అనే ఎన్జీవో సంస్థకు హాఫ్స్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు.