తంజావూరు, ఫిబ్రవరి 13: ఎల్టీటీఈ చీఫ్ వేలుపిైళ్లె ప్రభాకరన్ బతికే ఉన్నారా? అంటే అవునంటున్నాడు తమిళ జాతీయోద్యమ నేత పాళ నెడుమారన్. ప్రభాకరన్ అనుమతితోనే తాను ఈ ప్రకటన చేస్తున్నానని స్పష్టం చేశారాయన. వాస్తవానికి 2009లోనే ప్రభాకరన్ను మట్టుబెట్టామని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అయితే, 14 ఏండ్లు గడిచిన తర్వాత నెడుమారన్ ఈ ప్రకటన చేయటం యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. సోమవారం తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభాకరన్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే బయటకు వస్తారు.
ఈలం తమిళుల కోసం ప్రకటన చేస్తారు. నేను ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్తున్నందుకు ఆనందంగా ఉన్నది’ అని వెల్లడించారు. శ్రీలంకలో రాజపక్స ప్రభుత్వం కూలిపోవటం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభాకరన్ బయటికి వచ్చేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఇప్పుడీ ప్రకటన చేస్తున్నానని వివరించారు. ఆయన ఎక్కడున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2009 నాటికి ప్రభాకరన్ వయసు 54 ఏండ్లు.
ఖండించిన శ్రీలంక సైన్యం
తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ను హతమార్చినట్టు 2009లోనే శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన మృతికి సంబంధించిన చిత్రాలు కూడా బయటకు విడుదల చేసింది. ఆయన బతికే ఉన్నారని తాజాగా నెడుమారన్ పేర్కొనడంపై శ్రీలంక సైన్యం స్పందించింది. ఇదో జోక్ అని కొట్టివేసింది. ప్రభాకరన్ మృతికి సంబంధించిన డీఎన్ఏ ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని ఆర్మీ అధికార ప్రతినిధి రవి హెరాత్ తెలిపారు. దీనిపై విదేశాంగ మంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారని చెప్పారు.
ఎల్టీటీఈని ఎందుకు స్థాపించారంటే..
శ్రీలంకలోని తమిళులపై సింహళీయులు చూపుతున్న వివక్షతో ప్రభాకరన్ రగిలిపోయారు. 1970ల్లో తమిళ్ న్యూ టైగర్స్ను స్థాపించిన ఆయన.. 1975లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)గా పేరు మార్చారు. ఈ సంస్థే తమిళ్ టైగర్స్గా ప్రాచుర్యం పొందింది. ఈ సంస్థలో దాదాపు 10 వేల మంది సైన్యం ఉండేది. మహిళలు, చిన్నారులు కూడా ఇందులో సభ్యులే. ప్రవాస తమిళుల నుంచి ఈ సంస్థకు నిధులు అందేవి. ఆత్మాహుతి దాడులకైనా సిద్ధపడే ఈ సైన్యం చావుకు ఏ మాత్రం వెనుకాడేది కాదు. శ్రీలంకలోనే కాదు.. భారత్ సహా పలు దేశాలు ఎల్టీటీఈని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.
ఎవరీ ప్రభాకరన్?
‘పెద్దపులి’గా పేరుగాంచిన ప్రభాకరన్.. గెరిల్లా యోధుడు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడిన వ్యక్తిగా కొందరికి.. మనుషులను ఊచకోత కోసిన ఉన్మాదిగా ఇంకొందరికి తెలుసు. శ్రీలంకలోని వెలెవట్టితురైలో 1957 నవంబర్ 26న జన్మించిన ప్రభాకరన్.. శ్రీలంకలో తమిళులపై చూపుతున్న వివక్షపై ఉద్యమాల్లో పాల్గొన్నారు. భగత్సింగ్, సుభాష్చంద్రబోస్ల నుంచి తాను స్ఫూర్తి పొందానని, అలెగ్జాండర్, నెపోలియన్ జీవితాలు తనను ప్రేరేపించాయని ఆయన చెప్పుకొనేవారు.