న్యూఢిల్లీ : చైనాలో కొవిడ్-19 న్యూ వేరియంట్ విరుచుకుపడుతున్న వేళ కరోనా వైరస్ కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. డ్రాగన్ను వణికిస్తున్న బీఎఫ్.7 వేరియంట్ కేసులు భారత్లోనూ వెలుగుచూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్-19 నూతన మార్గదర్శకాలను జారీ చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖా మంత్రులతో శుక్రవారం కీలక భేటీ నిర్వహిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు విధిగా మాస్క్లు ధరించాలని, పరిశుభ్రత పాటించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.
మరోవైపు భారత్లో ఒమిక్రాన్ స్ట్రెయిన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7పై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని సీనియర్ శాస్త్రవేత్త, బెంగళూర్కు చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టిగ్స్) డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. మన జనాభాపై దీని తీవ్రత పెద్దగా ఉండబోదని, అయితే ప్రజలు విధిగా మాస్క్లు ధరించి, జనసమ్మర్ధ ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. కాగా, నూతన సంవత్సర వేడుకలు ఆపై పండుగల సీజన్ కోసం కొవిడ్ నూతన మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేయనుంది.
ఈ మార్గదర్శకాలపై మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సంప్రదింపులు జరుపుతారు. మరోవైపు న్యూ కొవిడ్ వేవ్ ముంచెత్తనుందనే భయాల నడుమ కేంద్రం గురువారం అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల కోసం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ నిర్వహించాలని, వైరస్ లక్షణాలున్నవారిని క్వారంటైన్కు తరలించాలని అధికారులను ఆదేశించింది. వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు విధిగా మాస్క్లు ధరించాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరింది.