భువనేశ్వర్: ఒడిశా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే దుర్యోధన్ మాఝీ (83) వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఈ ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. వృద్ధాప్యం కారణంగా గత కొంత కాలం నుంచి ఆయన అస్వస్థతతో ఉన్నారు. అయితే సోమవారం రాత్రి పరిస్థితి మరింత విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
స్వస్థలమైన నౌపాడా జిల్లాలో తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు దుర్యోధన్ మాఝీ తండ్రి కృషన్సింగ్ మాఝీ తెలిపారు. దుర్యోధన్ మాఝీ నౌపాడా జిల్లాలోని ఖరియార్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. రెండు సార్లు (1990, 1995) జనతాదళ్ టికెట్పై, మరో రెండు సార్లు (2000, 2004) బిజూ జనతాదళ్ టికెట్పై ఆయన గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఐదోసారి విజయం సాధించారు. వృద్ధాప్యం కారణంగా 2019లో పోటీచేయలేదు.
కాగా, దుర్యోధన్ మాఝీ మృతికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు మాఝీ మృతికి సంతాపం ప్రకటించారు.