న్యూఢిల్లీ: రాజ్యసభ సీనియర్ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర ప్రసాద్ (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో మరణించారు. మహేంద్ర ప్రసాద్ బీహార్ నుంచి వరుసగా ఏడు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతకుముందు ఒకసారి లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేశారు.
బీహార్కు చెందిన మహేంద్ర ప్రసాద్ 1970లలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 1980లో కాంగ్రెస్ టికెట్పై లోక్సభ సభ్యుడిగా గెలిచారు. కొన్నేండ్లపాటు కాంగ్రెస్లోనే ఉన్న ఆయన ఆ తర్వాత జేడీయూలో చేరారు. జేడీయూ నుంచి వరుసగా ఏడు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లో రాకముందే ఆయన అరిస్టో ఫార్మాస్యూటికల్స్ పేరుతో ఓ ఫార్మా కంపెనీని స్థాపించారు.
పారిశ్రామిక రంగంలో రాణిస్తూనే రాజకీయాల్లో ప్రవేశించి అనతికాలంలోనే గొప్ప నాయకుడిగా ఎదిగారు. కాగా, మహేంద్ర ప్రసాద్ మృతికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం ఒక్క రాజకీయ రంగానికే కాకుండా సామాజిక, పారిశ్రామిక రంగాలకు కూడా తీరనిలోటని వ్యాఖ్యానించారు. మహేంద్ర ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.