ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్కు (Congress) వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండటంతోపాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడం, రాష్ట్రంలో బీజేపీ (BJP) కూటమికి ఎదురులేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా తమదారి తాము చూసుకుంటున్నారు. వారం రోజుల క్రితం మాజీ మంత్రి మిలింద్ దేవరా (Milind Deora) కాంగ్రెస్కు గుడ్బై చెప్పగా.. మరో సీనియర్ నాయకుడు బాబా సిద్దిఖ్ (Baba Siddique) పార్టీకి రాజీనామా చేశారు. తన కుమారుడు, ఎమ్మెల్యే జీశన్తో కలిసి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ను కలిశారు. దీంతో ఆయన అజిత్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతారని తెలుస్తున్నది.
బాబా సిద్ధిఖ్ బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యార్థి దశలో స్టూడెంట్ లీడర్గా పనిచేసిన ఆయన ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2009 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర హౌసింగ్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ముంబై డివిజన్ చైర్మన్గా వ్యవహరించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలర్ చేతిలో ఓడిపోయారు.