ఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్, హిందీ న్యూస్ ఛానల్ ఆజ్ తక్ టాప్ యాంకర్లలో ఒకరైన రోహిత్ సర్దానా శుక్రవారం కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. జీ న్యూస్ను విడిచిపెట్టిన తర్వాత సర్దానా 2017లో ఆజ్ తక్లో చేరారు. “దంగల్” అనే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాడు. సర్దానా 2018లో గణేష్ విద్యా పురస్కరాన్ని అందుకున్నారు. భారతదేశంలో టీవీ న్యూస్ జర్నలిజంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో రోహిత్ సర్దానా ఒకరు.
రోహిత్ సర్దానా మృతిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. రోహిత్ సర్దానా మనల్ని చాలా త్వరగా విడిచిపెట్టారన్నారు. భారతదేశ పురోగతి పట్ల మక్కువ కలిగిన వ్యక్తి సర్దానా అన్నారు. ఆయన అకాల మరణం మీడియా ప్రపంచంలో పెద్ద శూన్యతను మిగిల్చిందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. సర్దానా అకాల మరణం బాధ కలిగించిందన్నారు. ధైర్యవంతుడైన జర్నలిస్టును జాతి కోల్పోయిందన్నారు. నిష్పాక్షికమైన జర్నలిజానికి పెట్టింది పేరన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని దేవుడు తన కుటుంబానికి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా తదితర నేతలు సర్దానా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.