ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న తరుణంలో శివసేన ఎంపీలు కీలక ప్రతిపాదన చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. అయితే రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని ఆయన అన్నారు. శివసేనకు 19 మంది లోక్సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యలున్నారు. సీఎం ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో పలువురు ఎంపీలు కూడా ఆయనకు మద్దతిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎంపీలతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన నివాసం మాతోశ్రీలో జరిగిన ఈ భేటీకి ఆయన వర్గం అయిన 16 మంది ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలపై ఈ సందర్భంగా చర్చించారు. అయితే గిరిజనురాలైన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని పార్టీ ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. మహారాష్ట్రలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నందున ఆమెకు ఓటు వేద్దామని సూచించారు. దీనిపై తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో చెబుతానని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ‘ద్రౌపది ముర్ము ఎన్డీయే అభ్యర్థి. అయితే గిరిజన వర్గానికి చెందిన మహిళ. మనం ఆమెకు మద్దతివ్వాలి. ఇది పార్టీ ఎంపీలందరి డిమాండ్. ఒకటి రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని ఉద్ధవ్ మాకు చెప్పారు’ అని ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన అన్నారు.
మరోవైపు ఎంపీల సమావేశంలో పాల్గొన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రధాన అనుచరుడైన సంజయ్ రౌత్, అనంతరం మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీంతో విపక్షాలు బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బదులుగా ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు మద్దతివ్వాలన్న ఎంపీల డిమాండ్కే ఉద్ధవ్ ఠాక్రే మొగ్గు చూపుతారని తెలుస్తున్నది. అయితే రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు ఎలాంటి విప్ జారీ చేయవు. ఎంపీలు తమ ఇష్టానుసారం నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చు.
కాగా, సీఎం షిండే కుమారుడైన ఎంపీ శ్రీకాంత్ షిండేతోపాటు షిండేకు మద్దతిస్తున్నట్లుగా భావిస్తున్న మరో ఐదుగురు ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే సమావేశానికి దూరంగా ఉన్నారు.