Himanta on Shivsena | మహారాష్ట్రలో అధికార శివసేనలో సంక్షోభంపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. శివసేనలో సంక్షోభం వల్ల అసోంలో వరదలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో తనకు ఎటువంటి పాత్ర లేదని పదేపదే వ్యాఖ్యానించారు. గువాహటిలో మాకు 200 హోటళ్లు ఉన్నాయి. అందులో బస చేయడానికి అతిథులు వస్తారు. వరదల పరిస్థితి చెప్పి, వారిని హోటళ్లను ఖాళీ చేయమని చెప్పగలమా? అని బిశ్వ శర్మ శనివారం ప్రశ్నించారు. మహారాష్ట్రలో (తిరుగుబాటు ఎమ్మెల్యేలకు) బీజేపీ మద్దతు ఇస్తున్నది. నేను భాగస్వామిని కాదు అని అన్నారు.
తమ పాత్రేమీ లేదని హిమంత బిశ్వశర్మ పదేపదే చెబుతున్నా.. ఆయన సహచర మంత్రులు, అసోం బీజేపీ నేతలు నిత్యం.. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ను సందర్శిస్తున్నారు. శివసేన రెబెల్స్కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. `బయట నుంచి అసోంకు వచ్చిన వారందరికీ భద్రత, సౌకర్యాలు కల్పించడం మా విధి. రేపు కాంగ్రెస్ నేతలు వచ్చిన వారికి కూడా ఇలాగే నేను స్వాగతం పలుకుతా. శివసేన నేతలు ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. వారి వల్ల అసోం వరదలు వెలుగు చూశాయి` అని హిమంత బిశ్వశర్మ అన్నట్లు ఏఎన్ఐ పేర్కొంది.
అసోంలో 35 జిల్లాలకు 28 జిల్లాలు వరదల్లో మునిగాయి. సుమారు 35 లక్షల మందిపై ప్రభావం పడింది. గత ఏప్రిల్ నుంచి వరదలు, కొండ చరియలు విరిగి పడటం వల్ల 117 మంది మరణించారు. సిల్చార్ నగరం నీటి మధ్య చిక్కుకున్నది. ఈ నగరంలో 80 శాతం మంది ఆహారం, నీటి సరఫరా కోసం అల్లాడుతున్నారు.
అసోంలోని బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యాల పట్ల స్థానికులు నిరసన తెలుపుతున్నారు. అసోం వరదల్లో మునిగిపోతే, పార్టీ ఫిరాయింపుల కోసం మహారాష్ట్ర నుంచి శివసేన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఫైవ్స్టార్ హోటల్లో బస కల్పిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నీటి మధ్య చిక్కుకున్న ప్రజలను సందర్శించి వారికి సహాయ చర్యలు చేపట్టాలని సీఎం హిమంత బిశ్వ శర్మను కోరుతున్నారు.