గౌహతి: అస్సాం రాజధాని గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో 38 మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మకాం వేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో గౌహతి నుంచి గుజరాత్లోని వడోదరకు వెళ్లారు. అక్కడే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో ఆయన రహస్యంగా భేటీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు గురించి షిండే వారితో చర్చించినట్లు సమాచారం. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో గౌహతికి చేరుకుని రెబల్ ఎమ్మెల్యేలున్న హోటల్కు తిరిగి వెళ్లినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు భవిష్యత్తు కార్యాచరణపై ఏక్నాథ్ షిండే వర్గం మల్లగుల్లాలు పడుతున్నది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో వారు గౌహతిలోని స్టార్ హోటల్లో మరో రెండు రోజులు అదనంగా ఉండనున్నారు. ఈ మేరకు రూమ్స్ బుకింగ్ను పొడిగించాలని రాడిసన్ బ్లూ హోటల్ మేనేజ్మెంట్ను కోరారు. కాగా, బుధవారం నుంచి అక్కడ ఉన్న షిండే వర్గం తొలుత ఈ నెల 28 వరకు రూమ్స్ బుక్ చేసుకుంది. అయితే భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో హోటల్ రూమ్స్ బుకింగ్ను తాజాగా ఈ నెల 30 వరకు పొడిగించుకున్నారు.