ముంబై : అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు ఆయన అనుచరులకు సంబంధించి మనీల్యాండరింగ్ వ్యవహారాలపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను బుధవారం ఈడీ ప్రశ్నించిన ఉదంతంపై మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వం మోదీ సర్కార్పై విరుచుకుపడింది. ఈ వ్యవహారంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ మాలిక్ను తన ఇంటి నుంచి ఈడీ తీసుకువెళ్లిన తీరు మహారాష్ట్ర సర్కార్కు సవాల్ వంటిదని అన్నారు. తమ రాష్ట్రానికి వచ్చి కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఓ మంత్రిని తీసుకువెళ్లాయని, 2024 తర్వాత మీ అందరినీ విచారిస్తామని సంజయ్ రౌత్ హెచ్చరించారు.
ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కాషాయ పార్టీకి ఘాటుగా ఆయన బదులిచ్చారు. ముందస్తు సమాచారం లేకుండా నవాబ్ మాలిక్ను ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా నవాబ్ మాలిక్ను ఈడీ కార్యాలయానికి ఎలా తీసుకువెళతారని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ ప్రశ్నించారు. మాలిక్ కొంతకాలంగా బీజేపీ నేతల బాగోతాలను బయటపెడుతుండటంతో కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ తీరుగా వేధిస్తోందని ఆరోపించారు.
నవాబ్ మాలిక్పై ఈడీ కొరడా ఝళిపిస్తుందని కొందరు బీజేపీ నేతలు ట్వీట్ల ద్వారా ముందుగానే పసిగట్టారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. నవాబ్ మాలిక్కు ఎలాంటి నోటీసు జారీ చేయకుండా నేరుగా ఆయనను ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారని, ఇది మహారాష్ట్రను అవమానించడమేనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ చౌకబారు రాజకీయాలకు తెరలేపిందని దుయ్యబట్టారు.