Modi Selfie Booth | హైదరాబాద్, జనవరి 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ‘మోదీ సెల్ఫీబూత్’ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. బూత్ల ఏర్పాటుకైన ఖర్చుపై సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారమిచ్చిన సీనియర్ అధికారిపై బదిలీ వేటు పడింది. సెంట్రల్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) శివరాజ్ మానస్పురె స్థానంలో కొత్తగా స్వప్నిల్ డీ నీలాను రైల్వేశాఖ నియమించింది. అలాగే, ఆర్టీఐ ద్వారా అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలను రైల్వే జోనల్ జనరల్ మేనేజర్ (జీఎం) లేదా డివిజనల్ రైల్వే మేనేజర్ తప్పనిసరిగా ఆమోదించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.
అసలేం జరిగిందంటే..
దేశంలోని దాదాపు 50 రైల్వే స్టేషన్లలో రైల్వేశాఖ ఇటీవల ‘మోదీ 3డీ సెల్ఫీ బూత్’లను ప్రారంభించింది. వీటిలో 20 బూత్లు శాశ్వతమైనవి కాగా, మరో 30 తాత్కాలికమైనవి. ఈ క్రమంలో సెల్ఫీ బూత్ల ఏర్పాటుకు ఎంత ఖర్చయిందంటూ ఇటీవల ఓ ఆర్టీఐ కార్యకర్త రైల్వేశాఖకు లేఖ రాశారు. ఈ ప్రశ్నపై స్పందించిన సెంట్రల్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ అభయ్ మిశ్రా.. ఒక్కో శాశ్వత బూత్ ఏర్పాటుకు రూ. 6.25 లక్షలు, తాత్కాలిక బూత్ ఏర్పాటుకు రూ. 1.25 లక్షల చొప్పున మొత్తంగా రూ. 1.63 కోట్లు ఖర్చయినట్టు సమాధానమిచ్చారు. దీంతో ప్రజల సొమ్మును అధికార పార్టీ బీజేపీ రాజకీయ ప్రచారానికి వినియోగించిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ జనరల్ మేనేజర్కు పై అధికారి అయిన సీపీఆర్వోను రైల్వేశాఖ బదిలీ చేసినట్టు పలువురు ఆరోపిస్తున్నారు.