జైపూర్: రాజస్థాన్కు చెందిన వివాదస్పద ఆశ్రమ గురువు ఆశారాం బాపును భద్రతా కారణాల వల్ల ఎయిమ్స్ జోధ్పూర్కు తరలించారు. జోధ్పూర్ సమీపంలోని మనై ఆశ్రమం నిర్వహించే ఆశారాం, తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు 16 ఏండ్ల భక్తురాలు 2013లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్కు పారిపోయిన ఆయనను 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆశారాం బాపుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో జోధ్పూర్ జైల్లో ఉన్న ఆయనతో పాటు మరో 12 మంది ఖైదీలకు ఇటీవల కరోనా సోకింది. ఈ నేపథ్యంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆశారాంను మూడు రోజుల కిందట జోధ్పూర్లోని ఎంజీ ఆసుపత్రిలో చేర్చారు.
మరోవైపు లైంగికదాడి బాధిత భక్తులు ఈ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఆశారాం ఉన్న ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఉండదని భావించిన పోలీసులు ఆయనను శుక్రవారం ఎయిమ్స్ జోధ్పూర్కు తరలించారు. ఇక్కడైతే ఆయనపై దాడి జరిగే అవకాశాలు ఉండవని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, ఆశారాం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నదని, ఐసీయూ వార్డులో ఆక్సిజన్ వ్యవస్థపై చికిత్స అందిస్తున్నట్లు ఎంజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను ఎయిమ్స్ జోధ్పూర్కు తరలించాల్సిన అవసరం లేదని అన్నారు.