లక్నో: భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్(Seema Haider)కు నోయిడా వ్యక్తి సచిన్ మీనాతో జరిగిన పెళ్లి చెల్లుబాటు కాదని పాకిస్థాన్కు చెందిన ఆమె భర్త గులాం హైదర్ ఆరోపించాడు. వారిద్దరి మోసంపై ఉత్తరప్రదేశ్లోని నోయిడా కోర్టులో కేసు వేశాడు. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా గులాం హైదర్ తరుఫున భారత్కు చెందిన న్యాయవాది మోమిన్ మాలిక్ వాదనలు వినిపించారు. గులాం హైదర్ నుంచి సీమా హైదర్ విడాకులు పొందలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సచిన్తో ఆమె పెళ్లి చెల్లదని పేర్కొన్నారు.
కాగా, సచిన్ను పెళ్లి చేసుకున్నట్లు బహిరంగంగా చెప్పిన సీమా, అరెస్టు తర్వాత బెయిల్ దరఖాస్తులో భర్త పేరు గులాం హైదర్గా పేర్కొందని న్యాయవాది మోమిన్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు ఏప్రిల్ 18 నాటికి దీనిపై నివేదిక సమర్పించాలని నోయిడా పోలీసులకు నోటీసు జారీ చేసింది.
మరోవైపు సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ దీనిపై స్పందించారు. కేవలం ప్రచారం కోసమే ఈ కేసు వేశారని అన్నారు. సీఆర్పీసీ కింద భారత్లో కేసు నమోదు చేయడానికి పాకిస్థాన్ పౌరులకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. సీమ హిందూమతాన్ని స్వీకరించి సచిన్ను పెళ్లిచేసుకున్నదని అన్నారు.