ముంబై: తనను పెళ్లి చేసుకోవాలంటూ సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్న వ్యక్తిని ఒక వివాహిత డిమాండ్ చేసింది. దీంతో విసిగిపోయిన ఆ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆ మహిళ మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితుడ్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 12న నవీ ముంబై కోపర్ఖైర్నే ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీ సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఒక మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే అదృశ్యమైన మహిళల గురించి పోలీస్ స్టేషన్లలో ఆరా తీశారు.
కాగా, ఒక మహిళ కనిపించడం లేదంటూ ట్రాంబే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. కోపర్ఖైర్నే పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆ మహిళ ఫొటో ఆనవాళ్లు మృతదేహంతో పోలి ఉండటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన మహిళ కుటుంబ సభ్యులను కలిసి ఆమె గురించి ఆరా తీశారు. నవీ ముంబైలోని మన్ఖుర్డ్ ప్రాంతంలో క్లీనర్గా తన భార్య పనిచేస్తున్నట్లు ఆమె భర్త పోలీసులకు తెలిపాడు. శనివారం విధులకు వెళ్లిన తర్వాత నుంచి ఆమె కనిపించడం లేదని చెప్పాడు.
మరోవైపు ఆ మహిళ మొబైల్ ఫోన్ను పోలీసులు గుర్తించారు. నవీ ముంబైలోని హౌసింగ్ కాంప్లెక్స్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే 40 ఏళ్ల రాజ్కుమార్ బాబూరామ్ పాల్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ హత్య గురించి ప్రశ్నించారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె పదే పదే డిమాండ్ చేస్తున్నట్లు ఆ సెక్యూరిటీ గార్డ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో వదిలించుకునేందుకు హౌసింగ్ కాంప్లెక్స్ సమీపంలోని ప్రాంతానికి ఆమెను రప్పించినట్లు చెప్పాడు. అక్కడ చున్నీతో ఆమె గొంతు నొక్కి హత్య చేసినట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.