ఏఆర్ మురగదాస్ తీసిన ‘సెవన్త్ సెన్స్’ సినిమా చూశారా? అందులో విలన్.. కండ్లతోటే మనుషులను నియంత్రిస్తాడు. అలా వాళ్లను హీరో మీద దాడి చేయడానికి ఉసిగొల్పుతాడు. సినిమా విషయం అటుంచితే, ఇప్పుడు చైనా రక్షణ దళం కూడా సరిగ్గా ఇలాంటి సాంకేతికత పైనే పనిచేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
దురాక్రమణ కాంక్షతో ఎప్పుడూ రగిలిపోయే డ్రాగన్ దేశం భవిష్యత్తులో జరుగబోయే యుద్ధాల్లో ఆధిపత్యాన్ని చెలాయించడానికి తన సైన్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నది. యాక్టివ్ డ్యూటీ మిలిటరీలో 22 లక్షలకు పైగా సైనికులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనా.. యుద్ధంలో వినూత్న సాంకేతికతలను కూడా వినియోగించడానికి గత కొన్నేండ్లుగా రహస్య ప్రయోగాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తీసుకొచ్చిందే.. ‘మైండ్ కంట్రోల్ వెపనరీ’ (మనిషి ఆలోచనలను నియంత్రించే ఆయుధం).
ఏమిటీ మైండ్ కంట్రోల్ వెపనరీ?
ప్రత్యర్థి దేశానికి చెందిన సైనిక కమాండర్ మెదడులోని వ్యూహాలను హ్యాక్ చేసి.. వాటిని తెలుసుకోవడం, అనంతరం వాటిని భగ్నం చేయడం, ఆ తర్వాత అతని ఆలోచనలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొని.. అతని దేశంపైకే అతని సైన్యాన్ని ఎదురుదాడికి ఉసిగొల్పడం.. ఈ లక్ష్యాలను నిర్వర్తించడానికి ఉద్దేశించిన ఆయుధమే ‘మైండ్ కంట్రోల్ వెపనరీ’. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో ఇది పనిచేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.
ఇలా వెలుగులోకి..
సంప్రదాయ ఆయుధాలు శత్రువులకు శారీరకంగానే హాని చేస్తాయి. అయితే, వ్యూహ-ప్రతివ్యూహాలు పురుడుపోసుకొనే శత్రువు మేధస్సును నియంత్రిస్తే.. యుద్ధంలో విజయం సాధించడం సులువు అవుతుంది. సరిగ్గా దీన్ని ఆధారంగా చేసుకొనే చైనా పరిశోధకులు.. బీజింగ్ అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్లో రహస్యంగా కొన్ని ప్రయోగాలను ప్రారంభించారు. రీసర్చ్ జరిగే ప్రాంతాన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పేర్కొంటూ ఎవరినీ అనుమతించేవారు కాదు. అయితే, 2019లో విడుదలైన ఓ మిలిటరీ డాక్యుమెంట్లో సదరు ఇన్స్టిట్యూట్లో ‘మైండ్ కంట్రోల్ వెపనరీ’పై ప్రయోగాలు జరుగుతున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. డ్రాగన్ దేశానికి చెందిన పలువురు రిటైర్డ్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జీన్ ఎడిటింగ్, బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్ తదితర అత్యాధునిక సాంకేతికతలపై అక్కడ ప్రయోగాలు జరుగుతున్నట్టు వెల్లడించారు.
అమెరికాకు చెందిన కొంత కీలక సమాచారాన్ని మిలిటరీ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు యాక్సెస్ చేసినట్టు కూడా వివరించారు. దీంతో అమెరికా కామర్స్ డిపార్ట్మెంట్.. చైనాకు చెందిన డజనుకు పైగా ఇన్స్టిట్యూట్లను గత ఏడాది డిసెంబర్లో బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉంచింది. విదేశాల ప్రాదేశిక సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రమాదకరమైన సాంకేతికతలను ఆయా సంస్థల్లో అభివృద్ధి చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ జాబితాలో బీజింగ్ అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ కూడా ఉన్నది. ఇలా.. ‘మైండ్ కంట్రోల్ వెపనరీ’పై చైనా ప్రయోగాలు సాగిస్తున్నట్టు గుప్పుమన్న అనుమానాలకు బలం చేకూరింది.
పౌరులు ఏమనుకుంటున్నారోనని..
ప్రభుత్వపాలనపై అసమ్మతితో ఉన్న పౌరులను గుర్తించి, వారిపై నిఘాను కొనసాగించడానికి కూడా చైనా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికోసం దేశవ్యాప్తంగా 50 కోట్ల సీసీటీవీ కెమెరాలను ఆ దేశం అమర్చింది. ప్రపంచంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న మొత్తం సీసీటీవీల సంఖ్యలో ఇది సగం. ప్రభుత్వ నేతల ప్రసంగాలు, కీలక నిర్ణయాలు వెల్లడించినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయ్యే మనుషుల ముఖ కవలికల ద్వారా ప్రభుత్వంపై వారి వైఖరిని పసిగట్టనున్నారు. ప్రత్యేక ఏఐ సిస్టమ్ సాంకేతికతను దీని కోసం వినియోగించనున్నారు.