రోగి శరీరంలోనే వైరస్ సమూల మార్పులు
హైదరాబాద్, జూలై 29: కరోనా మహమ్మారి కొత్త రూపాలు సంతరించుకోవడం వెనకున్న కారణాలను పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన రోగిలో వైరస్ కొన్ని మార్పులకు లోనవుతున్నదని పేర్కొన్నారు. మార్పులు పూర్తయిన అనంతరం.. వైరస్ బాధిత వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో వైరస్ తనలో జరిగిన మార్పులను కూడా కొత్త రోగి శరీరంలోకి తీసుకుపోతున్నట్టు తెలిపారు. దీంతో డెల్టా, ఆల్ఫా, కప్పా వంటి కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు వెలుగులోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. కొవిడ్-19 ఉద్ధృతి ప్రారంభమయ్యాక చైనా, భారత్, అమెరికా, మలేషియా, బ్రిటన్ తదితర దేశాల నుంచి వందలమంది రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. పరిశోధనలో హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలతో పాటు ఢిల్లీలోని సీఎస్ఐఆర్, ఎన్సీడీసీ, భువనేశ్వర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ వివరాలు ప్రీప్రింట్ సర్వర్ ‘మెడ్ఆర్ఎక్స్ఐవీ’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.