ముంబై : కరోనా హాట్స్పాట్గా మారిన మహారాష్ట్రలో సెకండ్ వేవ్ అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నందర్బర్ జిల్లాలో బుధవారం కేసులేమీ నమోదవలేదని, పలు జిల్లాల్లో కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని సీఎంఓ కార్యాలయం వెల్లడించింది. దూలే, వసిం, యావత్మాల్, వార్ధా, బంధారా, గోండియా జిల్లాల్లో కేవలం పదిలోపు యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఇక పర్బని, హింగోలి, నాందేడ్, అమరావతి, అకోలా, బుల్దాన, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో ప్రస్తుతం వందలోపు యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వీక్లీ పాజిటివిటీ రేటు 2.44 శాతానికి దిగివచ్చిందని తెలిపింది.అయితే సతారా, సంగ్లి, అహ్మద్నగర్, పుణే, ఉస్మానాబాద్, షోలాపూర్, సింధుదుర్గ్ జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని సీఎంఓ పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల రాజకీయ పార్టీల కార్యకలాపాలు సాగడం, పెద్దసంఖ్యలో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేయడం పట్ల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు గుమికూడేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.