న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కరోనా వైరస్ తీవ్రత మొదటి వేవ్లో ఉన్నట్టుగానే రెండోవేవ్లోనూ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు సంబంధిత గణాంకాలను బుధవారం విడుదల చేసింది. సెకండ్వేవ్ చాలా శక్తిమంతమైనదని, భారీ నష్టాన్ని కలిగిస్తుందని దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలను కేంద్రం వెల్లడించడం గమనార్హం. 146 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 15 శాతం కంటే ఎక్కువ ఉందని, 274 జిల్లాల్లో 5 నుంచి 15 శాతంలోపే ఉన్నదని విలేకరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఆయన తెలిపిన గణాంకాల ప్రకారం… మొదటి వేవ్లో 10 ఏండ్లలోపు పిల్లల్లో 4.03 శాతం మందిలో కరోనా కేసులు నమోదు కాగా రెండో వేవ్లో 2.97 శాతం మంది పిల్లల్లో కేసులు నమోదయ్యాయి. 30 ఏండ్లు పైబడిన వారిలో మొదటి వేవ్లో 67.5 శాతం, రెండో వేవ్లో 69.18 శాతం కేసులు నమోదయ్యాయి. మిగతా వయస్కుల్లో కూడా మొదటి, రెండో వేవ్లలో కరోనా సోకిన వ్యక్తుల శాతం మధ్య తేడా స్వల్పంగానే ఉంది. కరోనా మరణాల్లో మొదటి వేవ్లో 10 ఏండ్లలోపు వయసువారిలో 0.27 శాతం, రెండో వేవ్లో 0.34 శాతం, 60-70 ఏండ్ల గ్రూపులో మొదటి వేవ్లో 28.76 శాతం, రెండో వేవ్లో 28.21 శాతం నమోదయ్యాయి. మిగతా వయసు గ్రూపుల్లో కూడా మొదటి, రెండో వేవ్ మధ్య వ్యత్యాసం గరిష్ఠంగా 3 శాతం ఉన్నట్టు కేంద్రం గణాంకాలు తెలిపాయి.