చెన్నై : తమిళనాడులో నిర్వహించిన రెండవ సెరో సర్వేలో దాదాపు 23 శాతం మందిలో కొవిడ్-19తో పోరాడే యాంటీబాడీలు ఉన్నట్టు వెల్లడైంది. గత ఏడాది అక్టోబర్-నవంబర్ లో చేపట్టిన తొలి సెరో సర్వేలో 31 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయని తేలింది. రెండవ సెరో సర్వేను ప్రజారోగ్య సంచాలకుల ఆధ్వర్యంలో చెన్నై మినహా తమిళనాడులోని అన్ని జిల్లాల్లో నిర్వహించారు. 756 క్లస్టర్లలో 22,904 నమూనాలను ఈ సర్వేలో భాగంగా పరిశీలించారు. చెన్నై, సేలం, తిరుచ్చి, మధురై, కోయంబత్తూరు, తిరునల్వేలిల్లోని ల్యాబ్ ల్లో రక్త నమూనాలను పరీక్షించారు.
ఈ నమూనాల్లో 5316 మందిలో యాంటీ బాడీలను గుర్తించారు. అత్యధికంగా తిరువల్లూర్ జిల్లాలో 49 శాతం సెరో పాజిటివిటీ రేటు నమోదవగా, నాగపట్టణం జిల్లాలో అత్యల్పంగా 9 శాతం మందిలోనే యాంటీబాడీలను గుర్తించారు. ఇక ఈ సర్వేలో డెల్ట్రా స్ట్రెయిన్ సహా పలు కరోనా వేరియంట్లను గుర్తించారు. సెరో సర్వే చేపట్టిన సమయం, వ్యాక్సినేషన్ కవరేజ్, పలు కరోనా వేరియంట్ల వ్యాప్తి వంటి కారణాలతో సెరో పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందని తమిళనాడు ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జులై-ఆగస్ట్ లో మూడవ సెరో సర్వే చేపడతారు.