Congress G-23 Meet | కాంగ్రెస్ అధి నాయకత్వంపై అసమ్మతి స్వరం వినిపిస్తున్న జీ-23 నేతలు దేశవ్యాప్తంగా పర్యటించాలని గురువారం జరిగిన భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇంట్లో వరుసగా రెండో రోజు అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో కపిల్ సిబాల్, ఆనందశర్మ, భూపీందర్ సింగ్ హుడా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీతో భూపీందర్ సింగ్ హుడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అదే టైంలో పార్టీలో చీలిక తేవాలని అసమ్మతి నేతలు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. పరిస్థితుల్లో మార్పు తేవాలని గాంధీ కుటుంబంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారని వినికిడి.
పార్టీలో సమిష్టి, సమగ్ర నాయకత్వాన్ని తీసుకురావాలని కోరుతూ దేశవ్యాప్తంగా పర్యటించాలని జీ-23 నేతలు చెప్పారు. భావ సారూప్య కాంగ్రెస్ నేతలతో సమావేశమై సమిష్టి, సమగ్ర నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలన్న తమ ప్రతిపాదనలకు మద్దతు కూడగట్టాలని చూస్తున్నారు. పంజాబ్లో అధికారాన్ని కోల్పోవడంతోపాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో మాత్రమే అధికారంలో ఉన్నది.
జీ-23 నేతలంతా పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని, గాంధీయేతర నాయకుడికి పగ్గాలు అప్పగించాలని ఒత్తిడి తెస్తున్నారు. గాంధీల మద్దతుదారులు ఆ డిమాండ్ను తోసిపుచ్చుతున్నారు. సోనియా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలోనూ సంస్థాగత ఎన్నికల ఊసే రాలేదు. దీంతో అసమ్మతి నేతలు వరుసగా భేటీ అవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి గాంధీలు వైదొలిగి, ఇతరులకు అప్పగించాలని డిమాండ్ చేసిన సీనియర్ నేత కపిల్ సిబాల్పై రాహుల్ గాంధీ, సోనియాగాంధీ మద్దతుదారులు ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఆజాద్ ఇంట్లో భేటీకి ముందు రాహుల్తో సమావేశమైన భూపీందర్ సింగ్ హుడా.. సిబాల్పై చర్యకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసినట్లు సమాచారం. కపిల్ సిబాల్ మాత్రమే పార్టీ బలోపేతం గురించి మాట్లాడారని గుర్తు చేశారని వినికిడి.
ఇదిలా ఉంటే, నాయకత్వం నుంచి గాంధీలను తప్పించాలని పట్టుబడుతున్న జీ-23 నేతల్లో ఒకరైన గులాంనబీ ఆజాద్తో సోనియాగాంధీ ఫోన్లో మాట్లాడినట్లు తెలియవచ్చింది. పార్టీలో సమూల మార్పులకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ప్రతిపాదనలతో సోనియాగాంధీతో ఆజాద్ నేరుగా చర్చించనున్నారని వినికిడి