చెన్నై : దేశంలో మరోసారి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.4 వేరియంట్ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ వేరియంట్ తొలికేసు హైదరాబాద్లో నమోదవగా.. రెండో కేసు తమిళనాడులో రికార్డయ్యింది. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం ప్రకటించారు. సదరు వ్యక్తి చెంగల్పట్టు జిల్లాలోని నలవూరు వాసి అని తెలిపారు. కొత్త వేరియంట్ కేసు ఈ నెల 9న నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ప్రకటించింది.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 తొలి కేసును తొలిసారిగా ఈ ఏడాది జనవరి 10న దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలోని అన్ని ప్రావిన్సుల్లోనూ కేసులు రికార్డయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్లు పుట్టుకువచ్చాయి. అయితే, వేరియంట్ సోకిన వ్యక్తుల్లో కొత్త లక్షణాలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించడం పేర్కొన్నారు. కొత్త వేరియంట్లపై అధ్యయనాలు జరుగుతున్నాయని, వేరియంట్లు రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతాయని నిపుణులు పేర్కొన్నారు.