SP-RLD | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) -రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) మధ్య విభేదాలు బయట పడ్డాయి. తమ నేతల పొరపాట్ల వల్లే ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి ఓడిపోయిందిన ఆర్ఎల్డీ యూపీ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ అహ్మద్ ఆరోపించారు. ఎన్నికల్లో వివిధ స్థానాల టికెట్లు అమ్ముకున్నారని శనివారం చెప్పారు. దళితులు, మైనారిటీల సమస్యలను రెండు పార్టీలు నిర్లక్ష్యం చేశారన్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై పోరు చేయడానికి బదులు సీట్ల సర్దుబాటు విషయమై ఎస్పీ, ఆర్ఎల్డీ పరస్పరం ఒకరిపై మరొకరు పోరాడాయని డాక్టర్ మసూద్ చెప్పారు. తమ నేతల పొరపాట్ల వల్లే కూటమి విజయం సాధించలేకపోయిందన్నారు. హపూర్, బికాపూర్ స్థానాలతోపాటు పలు సీట్లను డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. డాక్టర్ మసూద్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పశ్చిమ యూపీలో మెజారిటీగా ఉన్న జాట్లు.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటంలో ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి కూడా పాల్గొన్నారు. జాట్లు, ముస్లింల కలయికతో ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి మెరుగైన సీట్లు గెలుచుకుంటుందని అంతా భావించారు. కానీ పశ్చిమ యూపీలో బీజేపీ గణనీయ విజయాలు సాధించింది.