ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లాలోని శ్యామాపూర్ ఏరియాలో నలుగురు కూలీలు మృత్యుంజయులుగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నదిలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న నలుగురు కూలీలు ఆ నదిలో నీళ్లు లేకపోవడంతో పని ముగిసిన అనంతరం అక్కడే నిద్రించారు. నది మధ్యలో ఓ పిల్లర్ కింద వాళ్లు నిద్రలోకి జారుకున్నారు. అయితే, ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నదిలోకి వరదలు పోటెత్తాయి.
దాంతో వాళ్లు నది నుంచి బయటికి వచ్చే మార్గం లేకుండా పోయింది. వెంటనే ఫోన్ ద్వారా విషయం తెలుపడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేయిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చింది. దాంతో రంగంలోకి దిగిన అధికారులు భారీ క్రేన్ సాయంతో ఆ నలుగురు కూలీలను రక్షించారు. అధికారుల రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.