Wheat | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న వరదలు, కరువు కాటకాలు, ఇంకోవైపు దేశాల మధ్య యుద్ధ వాతావరణం.. వెరసి ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం కట్టలు తెంచుకొంటున్నది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్పీ) అంచనాల ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటికే 82.8 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది 49 దేశాల్లో కరువు పరిస్థితులు దాపురించవచ్చని డబ్ల్యూఎఫ్పీ హెచ్చరించింది. ఇదే సమయంలో ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో ఆకలి కేకలను రెట్టింపు చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్మనీ పరిశోధకులు శుభవార్త చెప్పారు.
ఏడాదికి ఏకంగా ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేసినట్టు మ్యూనిచ్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ సరికొత్త వంగడంతో కేవలం 10 వారాల్లోనే పంట చేతికొస్తుందని తెలిపారు. నీటి వాడకం కూడా 95 శాతం వరకు తగ్గుతుందని వివరించారు. ఈ మేరకు జర్మనీకి చెందిన సైన్స్ వెబ్సైట్ ‘డ్యుయిష్ వెల్లే’ ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. ఒక ఎకరంలో ఏడాదికి 20 క్వింటాళ్ల గోధుమ పంటను పండించే రైతన్న.. ఈ వంగడం సాయంతో ఏడాదిలో అదే ఒక్క ఎకరాలోనే 100 క్వింటాళ్లకు పైగా పంటను పండించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ వంగడంతో ఆహార సంక్షోభానికి ముగింపు పలకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే గోధుమ వంగడాన్ని జర్మనీ పరిశోధకులు తీసుకొస్తే, శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంపొందించే మరో అరుదైన గోధుమ వంగడాన్ని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అభివృద్ధి చేశారు. ఈ గోధుమతో ఇమ్యూనిటీ పవర్ పెరుగడమే కాకుండా టైప్-2 డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బుల వంటి వ్యాధులను కూడా తగ్గించే వీలు ఉన్నదని పరిశోధకులు పేర్కొన్నారు.