బెంగళూరు: స్కూల్ విద్యార్థులతో టాయిలెట్లు క్లీన్ చేయించారు. (Students made to clean toilets) అలాగే డ్రైనేజీ గుంతలను కూడా శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లాలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన 7,8,9 తరగతులు చదివే ఆరుగురు విద్యార్థులతో స్కూల్ టాయిలెట్లు, మురుగు గుంతలు శుభ్రం చేశారు. అలాగే రాత్రి వేళ పిల్లలను మోకాళ్లపై నిలబెట్టారు. వారి వీపుపై బరువైన బ్యాగులు ఉంచి శిక్షించారు. తట్టుకోలేక డీహైడ్రేషన్ కారణంగా ఒక బాలుడు మూర్ఛపోయాడు.
కాగా, ఈ సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీల నేతలు దీనిపై మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన కమిటీ సభ్యులు ఆ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులతో టాయిలెట్స్ క్లీన్ చేయించడంపై ఆరా తీశారు. ఇన్చార్జ్ వార్డెన్ మునియప్ప, మరో ఇద్దరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.