Supreme Court | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: యావజ్జీవ శిక్షకు సరైన నిర్వచనం కోరుతూ దాఖలైన పిటిషన్ పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకరించింది. యావజ్జీవం అంటే జీవితాంతం శిక్షనా? లేక సీఆర్పీసీ సెక్షన్ 432 కింద దాన్ని తగ్గించడం కానీ, రద్దు చేయడం కానీ చేయవచ్చా? అనే దానిపై స్పష్టత కోరుతూ చంద్రకాంత్ ఝా అనే వ్యక్తి పిటిషన్ వేశారు. 2006, 2007లలో తీహార్ జైలు బయట మూడు తలలేని మొండెంల కేసులో చంద్రకాంత్ ఝా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు.
చంద్రకాంత్ పిటిషన్పై స్పందన కోరుతూ జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. న్యాయవాది రిషి మల్హోత్రా ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్లో ఐపీసీ సెక్షన్లు 302, 201 కింద తనకు శిక్ష విధించారని తెలిపారు. తనకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను ఢిల్లీ హైకోర్టు గతంలో యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని పేర్కొన్నారు. ఐపీసీలోని సెక్షన్ 302 రెండు శిక్షలను స్పష్టంగా పేర్కొన్నదని, ఒకటి మరణశిక్ష, రెండోది యావజ్జీవ కారాగార శిక్ష అని తెలిపారు. ఈ రెండు మినహా మరే ఇతర శిక్షను ఇందులో పేర్కొనలేదని తన పిటిషన్లో ఝా తెలిపారు. యావజ్జీవ కారాగార శిక్షను జీవితాంతం వరకు అని పరిగణించినట్లయితే.. అది దోషిగా ఆ వ్యక్తి ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు అవుతుందని పిటిషన్ పేర్కొన్నది.