న్యూఢిల్లీ: మావోయిస్టులతో లింకు ఉన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ(Professor G N Saibaba)ను నిర్దోషిగా బాంబే హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో స్టే ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థనను కొట్టివేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. త్వరగా ఈ కేసులో వాదనలు చేపట్టాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు చేసిన అభ్యర్థనను కూడా సుప్రీం బెంచ్ తిరస్కరించింది. సరైన సమయంలోనే ఈ కేసులో విచారణ ఉంటుందన్నారు. నిర్దోషిగా ప్రకటించిన తీర్పును అత్యవసరంగా మార్చాల్సిన అవసరం లేదని బెంచ్ తెలిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసంగానే ఉందని ప్రాథమికంగా నిర్ధారణ అవుతోందని బెంచ్ వెల్లడించింది.