న్యూఢిల్లీ: తమ మనవళ్లు, మనవరాళ్లపై గ్రాండ్ పేరెంట్స్కే ఎక్కువ మమకారం ఉంటుందని, తల్లిదండ్రుల తర్వాత వారే బాగా చూసుకోగలరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆరేళ్ల బాలుడి కస్టడీని తాత, నానమ్మలకు అప్పగించింది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన దంపతులు గత ఏడాది కరోనాతో మరణించారు. 2021 మే 13న భర్త, జూన్ 12న భార్య చనిపోయారు. దీంతో వారి ఐదేళ్ల కుమారుడు అనాథ అయ్యాడు. తల్లికి అంత్యక్రియల పేరుతో బాలుడి అమ్మ తరుఫు కుటుంబం అతడ్ని తమ ఊరుకు తీసుకెళ్లింది. తల్లి తరుఫు బంధువైన 46 ఏళ్ల మహిళ అతడి ఆలనాపాలనా చూస్తున్నది.
అయితే ఆరేళ్ల మనువడ్ని తమకు అప్పగించాలంటూ బాలుడి తాత, నానమ్మలైన 71 ఏళ్ల స్వామినాథన్ కుంచు ఆచార్య, 63 ఏళ్ల ఆయన భార్య గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తమ మనవడి బాగోగులు, ఆరోగ్యం, విద్యపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పిల్నాడ్ని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు.
కాగా, బాలుడి తాత, నానమ్మల వయసును గుజరాత్ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో అతడి కస్టడీని అవివాహిత, ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉంటున్న తల్లి తరుఫు బంధువైన మహిళకు అప్పగించింది. దీంతో ఆ వృద్ధ జంట గుజరాత్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పుట్టిన 20 రోజుల నుంచి తమ మనవడ్ని చాలా జాగ్రత్తగా చూశామని, అతడి చదువు, భవిష్యత్తు రిత్యా తమకు అప్పగించాలని కోరారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం వారి పిటిషన్పై విచారణ జరిపింది. మనవళ్లపై గ్రాండ్ పేరెంట్స్కే ఎక్కువ మమకారం, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటాయని తెలిపింది. మన సమాజంలో మనవళ్ల ఆలనాపాలనను గ్రాండ్ పెరెంట్సే ఎక్కువగా చూస్తారని గుర్తు చేసింది. మారుమూల గిరిజన ప్రాంతమైన దాహోద్ కంటే అహ్మదాబాద్లో ఆ బాలుడికి మంచి విద్యావకాశాలు ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. ఆ గ్రాండ్ పేరెంట్స్ వయసును పరిగణిలోకి తీసుకోని సుప్రీంకోర్టు, ఆరేళ్ల మనవడి కస్టడీని వారికి అప్పగించింది. అయితే ఆ బాలుడ్ని కలుసుకునే హక్కును ఆ మహిళకు కల్పించింది.