Supreme Court | భారత న్యాయవ్యవస్థలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక అరుదైన పరిణామం చోటుచేసుకున్నది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఇప్పటి వరకు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. దీన్ని సుప్రీంకోర్టు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. మాజీ సీజేఐ గడువు ముగిసినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో ఆ బంగ్లాను స్వాధీనం చేసుకోవాలంటూ కేంద్రానికి అధికారికంగా లేఖ రాసింది. ఢిల్లీలోని కృష్ణా మీనన్ మార్గ్లో ఉన్న 5వ నంబర్ బంగ్లాను సీజేఐకి కేటాయించడం ఆనవాయితీగా వస్తున్నది.
జస్టిస్ డీవై చంద్రచూడ్ గతేడాది నవంబర్లో సీజేఐగా పదవీ విరమణ చేశారు. ఇప్పటికీ ఆయన అదే బంగ్లాలో నివాసం ఉంటూ వస్తున్నారు. నిబంధనల మేరు పదవీ విరమణ తర్వాత భవనంలో ఉంటేందుకు ఆరు నెలల గడువు ఉంటుంది. అయితే, ఆయనకు మే 10తో గడువు ముగిసింది. ప్రత్యేక అనుమతితో మే 31 వరకు పొడిగించినా బంగ్లాను ఖాళీ చేయలేదు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు యంత్రాంగం ఈ నెల ఒకటి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. జస్టిస్ చంద్రచూడ్ నుంచి బంగ్లాను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని.. ఆయనకు ఇచ్చిన గడువు ముగిసిందని సుప్రీంకోర్టు లేఖలో స్పష్టం చేసింది. అయితే, దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. తప్పనిసరి వ్యక్తిగత కారణాలతో ఆలస్యం జరిగిందని తెలిపారు.
ఈ విషయం సైతం యంత్రాంగానికి తెలుసునన్న ఆయన.. ప్రత్యేక అవసరాలున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి (నెమాలిన్ మయోపతి) నేపథ్యంలో వారి కోసం అనువుగా ఉండే ఇల్లు చూసుకునేందుకు కొంత సమయం పట్టిందన్నారు. ప్రభుత్వం తనకు ప్రత్యామ్నాయ వసతి కేటాయించిందని.. అయితే, ఆ ఇల్లు చాలాకాలం మూసి ఉండడంతో కొన్ని మరమ్మతులు జరుగుతున్నాయని.. పూర్తయిన వెంటనే అందులోకి మారిపోతానని స్పష్టం చేశారు. తాను అత్యున్నత పదవిలో పని చేశానని.. బాధ్యతలు తనకు తెలుసునన్నారు. కొద్దిరోజుల్లోనే సమస్య పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు. అయితే, సుప్రీంకోర్టు యంత్రాంగం ఓ మాజీ సీజేఐని అధికారిక నివాసం ఖాళీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయడం ఇదే తొలిసారి.