బెంగళూరు, మార్చి27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో ఇటీవల ఎస్సీల రిజర్వేషన్ను 15 శాతం నుంచి 17 శాతానికి పెంచిన ప్రభుత్వం.. ఉప కులాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ 17 శాతం రిజర్వేషన్లలో 6 శాతాన్ని ఎస్సీ లెఫ్ట్ సబ్-క్యాటగిరీకి, 5.5 శాతాన్ని ఎస్సీ రైట్కు, 4.5 శాతాన్ని ఇంకో ఉప కులానికి (బంజారా), మిగిలిన ఒక్క శాతాన్ని ఇతర ఉప కులాలకు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. ఈ రిజర్వేషన్ల విషయాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాసినట్టు తెలిపింది.
అయితే తమ కులానికి తక్కువ రిజర్వేషన్లు కల్పించారంటూ బంజారాలు ఆందోళనకు దిగారు. శివమొగ్గ జిల్లాలోని మాజీ సీఎం, బీజేపీ నేత యెడియూరప్ప ఇంటిని సోమవారం ముట్టడించారు. ఇంటిపైకి రాళ్లు రువ్వారు. దీంతో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆందోళనకారుల్లోనూ కొందరికి దెబ్బలు తగిలాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 144 సెక్షన్ను పోలీసులు విధించారు. సీఎం బొమ్మై మాట్లాడుతూ ఈ ఆందోళన వెనుక కాంగ్రెస్ ఉన్నదని ఆరోపించారు.