న్యూఢిల్లీ, మార్చి 30: లఖింపూర్ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రాకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని తాము నియమించిన కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ఎందుకు అప్పీల్ చేయలేదని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న జస్టిస్ రాకేశ్కుమార్ జైన్ సిఫార్సుపై వైఖరేంటో చెప్పాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం యోగి సర్కారును ఆదేశించింది.
ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ రమణ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిట్ చీఫ్ నివేదికను జస్టిస్ రమణ ప్రస్తావించారు. ఆశిష్ బెయిల్ రద్దుపై అప్పీల్ సిఫారసు చేయడంతో పాటు, దానికి సంబంధించి యూపీ హోంశాఖ అదనపు కార్యదర్శికి సిట్ రెండు లేఖలు కూడా పంపిందని తెలిపారు. స్పందించిన న్యాయవాది జెఠ్మలానీ..లేఖలు అందలేదని అడిషనల్ సెక్రటరీ చెప్పారని తెలిపారు. దీంతో కేసు పర్యవేక్షక జడ్జి నివేదిక, సిట్ రాసిన లేఖలను పరిశీలించి ఏప్రిల్ 4లోగా సమాధానం చెప్పాలని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో యూపీ సర్కార్ ఇరకాటంలో పడింది. సిట్ చీఫ్ జస్టిస్ రాకేశ్కుమార్ జైన్ సిఫార్సులపై కచ్చితంగా తమ వైఖరి చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఫిబ్రవరి 10వ తేదీన ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బాధిత రైతు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశిష్కు సులభంగా బెయిల్ వచ్చేందుకు యోగి సర్కార్ మార్గం సుగమం చేసిందని, ఈ కేసులో సాక్ష్యులకు కూడా సరైన రక్షణ ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అశిష్ బెయిల్ పిటిషన్ను తాము గట్టిగా వ్యతిరేకించామని చెప్పుకొచ్చింది.
రైతులను తొక్కించి చంపిన ఘటనలో కీలక సాక్షిగా ఉన్న ఒకరిపై ఇటీవల దాడి జరిగింది. దీనిపై పిటిషన్దారుల తరపున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఆశిష్ మిశ్రా బెయిల్పై వచ్చిన తర్వాతనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. యూపీలో బీజేపీ మళ్లీ గెలిచిందని, అతనికి సర్కారు మరింత రక్షణ ఇవ్వాలని కోరారు. అయితే వ్యక్తిగత వివాదం కారణంగానే పిటిషన్దారులు పేర్కొన్న దాడి జరిగిందని, దీనికి కేసుతో సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.