ముంబై, సెప్టెంబర్ 1: ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఒక వ్యక్తికి లభించే రక్షణ పరిధిని కేవలం ఒక ప్రాంతానికో, ఒక రాష్ర్టానికో పరిమితం చేయరాదని, దేశంలో ఎక్కడ ఉన్నా అతనికి ఆ చట్టం ద్వారా రక్షణ లభించాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భారత దేశంలో ప్రబలంగా ఉన్న కుల వ్యవస్థ సంక్లిష్టమైనదని బెంచ్ వ్యాఖ్యానించింది. జస్టిస్లు రేవతి మోహిత్ దెరే, భారతి డాంగ్రే, ఎన్జే జమాదర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఈ చట్టం షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగల వారిపై దౌర్జన్యాలు, దాడులు జరుగకుండా, వేధింపులు, అవమానాలకు గురికాకుండా సామాజిక-ఆర్థికంగా, రాజకీయంగా ఆ వర్గాల వారు కూడా అన్ని హక్కులు సమానంగా పొందడానికి ఉద్దేశించినదని అన్నారు. అలాంటి చట్టాన్ని ఒక రాష్ర్టానికో, ప్రాంతానికో పరిమితం చేయరాదని స్పష్టం చేసింది. ఒక వేళ ఆ వ్యక్తి ఉంటున్న ప్రాంతంలో అతను ఎస్సీ, ఎస్టీ కింద గుర్తింపు పొందనప్పటికీ ఆ చట్టం కింద లభించే రక్షణ పొందడానికే అర్హుడేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
తన తల్లిదండ్రుల కులమే పుట్టుకతోనే ఏ వ్యక్తికైనా ఆటోమేటిక్గా వస్తుందని తెలుపుతూ, అతను ప్రాంతం మారినంత మాత్రాన అది మారదని పేర్కొంది. ఒక వ్యక్తి సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాలకు వెళ్లినా అ వ్యక్తి తన కులాన్ని వదులుకునే అవకాశం చట్టప్రకారం లేదని ధర్మాసనం పేర్కొంది. తన కులం కారణంగా ఆ వ్యక్తి ఇబ్బందులు, కష్టాలు పడ్డా, జీవితాంతం దానితో పయనించాల్సిందేని పేర్కొంది.
కొందరు పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ అభినవ్ చంద్రచూడ్ వాదిస్తూ.. ఎస్సీ, ఎస్టీగా ఒక రాష్ట్రంలో గుర్తింపు పొందిన వ్యక్తి మరో రాష్ర్టానికి వలస వచ్చినప్పుడు, ఆ రాష్ట్రంలో అతని కులానికి ఎస్సీ, ఎస్టీగా అక్కడ గుర్తింపు లేనప్పుడు అతనికి ఆ చట్టం ద్వారా సంక్రమించిన రక్షణ లభించదని, అతనికి ఆ చట్టం వర్తించదని పేర్కొన్నారు. అయితే దీనిని అడ్వకేట్ జనరల్ బీరేంద్ర సరఫ్ ఖండిస్తూ ఒక వ్యక్తి ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వాడైతే దేశంలో ఎక్కడున్నా.. అతనున్న ప్రదేశంలో అతను ఆ వర్గంగా గుర్తింపు పొందకపోయినా ఆ చట్టం ద్వారా సంక్రమించిన అన్ని హక్కులు పొందడానికి అర్హుడేనని వాదించారు. ఆయన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.