న్యూఢిల్లీ, మే 20: జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు వారణాసి సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. కేసులో ఉన్న సంక్లిష్టత, సున్నితత్వం దృష్ట్యా ఈ కేసు విచారణకు అనుభవం ఉన్న సీనియర్ జడ్జి అవసరమని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే, మొదటగా మసీదు కమిటీ దరఖాస్తు చేసుకొన్నట్టుగా.. ‘హిందువుల పిటిషన్ పార్లమెంటు చట్టానికి విరుద్ధంగా ఉందా.. లేదా.. అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి’ అని జిల్లా జడ్జిని ఆదేశించింది. అప్పటి వరకు తాము ఈ నెల 17న ఆదేశాలు జారీ చేసినట్టుగా ముస్లింలు నమాజు చేసుకోవచ్చని, శివలింగం ఉన్నట్టుగా భావిస్తున్న ప్రాంతానికి భద్రత ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.