జైపూర్: ఒక వృద్ధుడు తాను శివుడి అవతారమని, శివుడు తనను పంపాడని చెప్పాడు. తిరిగి బతికిస్తానంటూ వృద్ధురాలిని హత్య చేశాడు (Old Man Kills Old Woman). ఇది స్థానికంగా కలకలం రేపింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 60 ఏండ్ల ప్రతాప్ సింగ్ ఫుల్గా మద్యం సేవించాడు. నడిచి వెళ్తుండగా మార్గమధ్యలో 85 ఏండ్ల కల్కీ బాయి కనిపించింది. సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్తున్న ఆ వృద్ధురాలితో అతడు మాటలు కలిపాడు. ఆమె పక్కన కూర్చొని తాను శివుడి అనుచరుడినని తెలిపాడు. ఆమె కోసం శివుడు తనను పంపినట్లు చెప్పాడు. ‘నువ్వు రాణివి. చంపి తిరిగి బతికిస్తా’ అని ఆమెతో అన్నాడు. ఉన్నట్టుండి ఆ వృద్ధురాలి కడుపులో బలంగా పంచ్లు ఇచ్చాడు. పక్కనే ఉన్న ఒక వ్యక్తి ప్రతాప్ సింగ్ను నిలువరించేందుకు ప్రయత్నించినా అతడు ఆగలేదు. నేలపై పడిన ఆమె తలపై చేతిలో ఉన్న గొడుగుతో కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయింది.
కాగా, ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్పందించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మైనర్ బాలురని తెలిపారు.
మరోవైపు ఆ వృద్ధురాలు మంత్రగత్తెగా అనుమానించడంతో ప్రతాప్ సింగ్ ఆమెను హత్య చేసినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే పోలీసులు వాటిని ఖండించారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు తాను శివుడి అవతారమన్న భ్రమలో ఉన్నాడని, తిరిగి బతికిస్తానంటూ వృద్ధురాలిపై దాడి చేసి చంపాడని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
"Lord Shiva Sent Me": 60-Year-Old Man Kills 85-Year-Old-Woman In Rajasthan@harsha_ndtv reports pic.twitter.com/nbMCyLVTfR
— NDTV (@ndtv) August 6, 2023