బెంగళూరు: బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త అయిన సావర్కర్పై మరో వివాదం చెలరేగింది. జైల్లో ఉన్నప్పుడు ఆయన పక్షులపై కూర్చొని ఎగురుతూ బయటకు వెళ్లి మాతృభూమిని సందర్శించేవారని ఒక పుస్తకంలో పాఠ్యాంశంగా ముద్రించారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇది వెలుగుచూసింది. పాఠ్య పుస్తకాల సమీక్షా కమిటీ సూచనతో హైస్కూల్ పాఠ్య పుస్తకాలను మార్పు చేశారు. ఈ నేపథ్యంలో వినాయక్ దామోదర్ సావర్కర్పై ఒక పాఠ్యాంశాన్ని 8వ తరగతి కన్నడ పుసక్తంలో చేర్చారు.
కాగా, అండమాన్ జైలులో ఉన్న సమయంలో సావర్కర్ పక్షుల రెక్కలపై కూర్చొని స్వదేశాన్ని సందర్శించేవారని అందులో ఉంది. ‘సావర్కర్ను ఖైదు చేసిన జైలులో చిన్న రంధ్రమైనా లేదు. కానీ, బుల్బుల్ పక్షులు ఆ జైలు గదిని సందర్శించేవి. సావర్కర్ ఆ పక్షుల రెక్కలపై కూర్చొని జైలు నుంచి బయటకు వచ్చేవారు. ప్రతిరోజూ పక్షులపై ఎగురుతూ వచ్చి మాతృభూమిని సందర్శించేవారు’ అని కొత్త పాఠ్యపుస్తకంలో ముద్రించారు. దీంతో కన్నడ పాఠ్య పుసక్తంలోని ఈ భాగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.