మధురై: తమిళనాడులో ఏప్రిల్ ఆరో తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ స్వతంత్య్ర అభ్యర్థి తన మ్యానిఫెస్టో రిలీజ్ చేశాడు. చిత్ర విచిత్రమైన హామీలను ఆ మ్యానిఫెస్టోలో ప్రకటించాడు. దక్షిణ మధురై నుంచి పోటీ చేస్తున్న శరవణన్ అనే అభ్యర్థి తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఓ ఐఫోన్, కారు, హెలిక్యాప్టర్, రోబో ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఇవే కాదు, స్విమ్మింగ్ పూల్ ఉన్న మూడంతస్తుల ఇంటిని, యువతకు కోటి రూపాయలతో పాటు వంద రోజుల పాటు చంద్రుడి మీదకు టూర్ తీసుకెళ్తానంటూ హామీ ఇచ్చాడు. మధురైలో స్పేస్ రీసర్చ్ సెంటర్, రాకెట్ లాంచ్ సైట్, ఆర్టిఫీషియల్ ఐస్బర్గ్ను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు. ఎన్నికల వేళ పార్టీలు, నేతలు హామీలు ఇచ్చి ఆ తర్వాత మరిచిపోతుంటారని, ఓటర్లు ఆ విషయాన్ని గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఇలాంటి హామీలు ఇచ్చినట్లు శరవణన్ తెలిపాడు. సంక్షేమ పథకాలు ప్రకటించే పార్టీలు.. ఆ తర్వాత వాటిని అమలు చేయవని, దానిపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి హామీలతో మ్యానిఫెస్టో రిలీజ్ చేసినట్లు ఓ మీడియాతో చెప్పాడు.